చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన వేడి అందించడంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. జలుబు చేసినప్పుడు శొంఠి పొడి నీటిలో వేసి మరగబెట్టి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే కాఫీ లేదా టీకి శొంఠి కలిపితే గొంతులో గరగర, దగ్గు సమస్యలు తగ్గుతాయి.
శొంఠి ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనకరం. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, క్రాంప్స్ తగ్గించడంలో ఇది సహజమైన పరిష్కారం. శొంఠి తినడం వల్ల మెటబోలిజం వేగవంతమవుతుందనే పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో శరీరంలో కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గడంలో ఇది సహకరిస్తుంది.
అంతేకాకుండా, శొంఠిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. గ్యాస్, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధ సమస్యలకు ఇది అద్భుత ఔషధం. గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల కడుపులోని అసౌకర్యం తగ్గి, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.
మొత్తానికి, చలికాలంలో శొంఠిని వాడడం వల్ల మన ఇమ్యూనిటీ బలపడుతుంది, జలుబు–దగ్గు సమస్యలు దూరమవుతాయి, శరీరం తేలికగా అనిపిస్తుంది. సహజంగా ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే రోజువారీ ఆహారంలో కొద్దిగా శొంఠిని చేర్చడం మర్చిపోవద్దు.

