తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే హరీష్ రావు నివాసంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చివరి చూపు చూసేందుకు తరలివచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు సత్యనారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. బిఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.
ఇదే సమయంలో మాజీ ఎంపీ, జాగృతి వ్యవస్థాపకురాలు కవిత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె తన ట్వీట్లో,
“మాజీ మంత్రి హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
అయితే, కవిత వ్యక్తిగతంగా హరీష్ రావు నివాసానికి వెళ్లారా లేదా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది నెలలుగా కవిత–హరీష్ రావు మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. కవిత ఇటీవల హరీష్ రావు పై అవినీతి ఆరోపణలు చేస్తూ, “హరీష్ రావు మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు” అని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుచేసుకోవాలి. ఈ ఆరోపణల అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో హరీష్ రావు తండ్రి మరణం పట్ల ఆమె ట్వీట్ ద్వారా సంతాపం తెలియజేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. కొందరు ఆమె స్పందనను “సానుభూతి చూపిన మంచి నిర్ణయం”గా చూస్తుండగా, మరికొందరు “కుటుంబ విభేదాల నడుమ కవిత దూరంగా ఉండటమే సరైనదా?” అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.
కవిత ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్ట్ ప్రాంతంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కారణంగా ఆమె హరీష్ రావు ఇంటికి వెళ్లలేకపోయారని ఆమె వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆమె సాయంత్రం వరకు పరామర్శకు వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
మరోవైపు, హరీష్ రావు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో కవిత–హరీష్ రావు మధ్య ఉన్న దూరం మరింత పెరుగుతుందా? లేక కుటుంబ బంధం ఈ విషాద సమయంలో వారిని దగ్గర చేస్తుందా? అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.

