దేశంలో ఎల్పీజీ సరఫరాపై వస్తున్న వార్తల నేపథ్యంలో హోటల్ పరిశ్రమలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ సమస్యపై హైదరాబాద్లో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు సివిల్ సప్లైస్ అధికారులను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు.
హోటల్ యజమానులు కమిషనర్ను కలిసి గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించి, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉత్పత్తి, దిగుమతి, సరఫరా వంటి అంశాలు లేకపోయినా మానిటరింగ్ మాత్రం రాష్ట్రం చేయగలదని అధికారులు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1955 నాటి Essential Commodities Act లోని సెక్షన్ 3 కింద కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రకారం ఎల్పీజీ సరఫరాను ప్రజలకు సక్రమంగా అందేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

