దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య తీవ్రంగా మారుతోంది. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు డిస్ట్రిబ్యూటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతుండటంతో చాలా మంది స్వయంగా డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది.
చాలా మంది వినియోగదారులు పది రోజుల కిందటే గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ సిలిండర్ అందలేదని చెబుతున్నారు. దీంతో ఇంటి అవసరాల కోసం గ్యాస్ తప్పనిసరిగా కావడంతో గంటల తరబడి ఎండలోనే క్యూలో నిలబడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, చిన్న రెస్టారెంట్లు, పీజీ హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా చోట్ల హోటళ్లు తాత్కాలికంగా మూసివేయగా, మరికొన్ని చోట్ల మెనూలో ఉన్న వంటకాలను తగ్గించి కేవలం కొన్ని వంటకాలకే పరిమితం అయ్యాయి. గ్యాస్ అందుబాటులో లేకపోతే మరికొన్ని రోజుల్లో మరిన్ని వ్యాపారాలు మూసివేయాల్సి వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
డెలివరీ సిబ్బంది ప్రకారం గతంలో రోజుకు రెండు లోడ్ల వరకు గ్యాస్ సిలిండర్లు వచ్చేవని, కానీ ప్రస్తుతం సరఫరా తగ్గిపోయిందని తెలిపారు. సాధారణంగా బుక్ చేసిన రోజే డెలివరీ చేసేవాళ్లమని, ఇప్పుడు మాత్రం మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆలస్యం అవుతోందని చెప్పారు.
ఇదిలా ఉండగా కొంతమంది ప్రజలు అంతర్జాతీయ పరిస్థితుల వల్లే ఈ సమస్య వచ్చిందని భావిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా, రవాణా వ్యవస్థపై ప్రభావం పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఎలా మారుతుందో స్పష్టత లేకపోయినా, గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరఫరా సమస్య పరిష్కారం కాకపోతే సాధారణ ప్రజలతో పాటు హోటల్, ఫుడ్ వ్యాపారాలు కూడా మరింత నష్టపోయే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

