ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనగణనకు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ జనగణనకు సంబంధించి రూ.11,718.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణనను కూడా తొలిసారి చేపట్టనున్నారు.
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచే ప్రతిపాదన, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతి, ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే ఈ కులగణన, జనగణన నిర్ణయాలపై తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ కేంద్రబిందువుగా మారింది. కులగణన పూర్తయి దానిని నైన్త్ షెడ్యూల్లో చేర్చినప్పుడే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విషయంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ — బీసీలను మోసం చేశాయని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 18 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదన చేయడం మొదటి తప్పు అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికే పరిమితం చేయడం బీసీలకు తీవ్ర అన్యాయమని విమర్శిస్తున్నారు.
ఇక బీసీ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకే ఉద్యమంగా పోరాడాల్సిన బీసీ సంఘాలు విడివిడిగా, వేర్వేరు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఉద్యమ బలం తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై స్పష్టత వచ్చింది. 2028 జూన్ నాటికి జనగణన పూర్తయినప్పటికీ, పునర్విభజన ప్రక్రియకు కనీసం మరో ఏడాదిన్నర సమయం పడనుండటంతో 2028 అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుత నియోజకవర్గాలతోనే జరగనున్నాయి. కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగే అవకాశం 2034 తర్వాతే ఉందని స్పష్టం అవుతోంది.
దీంతో కులగణన పూర్తయ్యే వరకు, నైన్త్ షెడ్యూల్లో చేర్చే వరకు బీసీలకు రాజకీయంగా పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బీసీ సంఘాలు ఏకమై పోరాడితేనే ఫలితం ఉంటుందని, లేకపోతే బీసీలకు నష్టం కొనసాగుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

