హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న, జాజ శ్రినివాసులు, యాదవల శ్రీనివాస్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిపక్ష నాయకులు మరియు బీసీ సంఘాలు ప్రభుత్వం వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాను కూడా అక్కడి నుంచి దూరం చేయడానికి పోలీసులు ప్రయత్నించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“బీసీలకు న్యాయం చేయాలని కోరితే అరెస్టులా? ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశ పాలనా?” అంటూ స్థానిక నాయకులు ప్రశ్నించారు.
ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుండగా, ఉద్యమం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

