మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాంగ్రెస్ నేత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అనేది ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, అది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని స్పష్టం చేశారు. పార్టీని అంగట్ల సరుకులా భావిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 50 స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలే పార్టీకి ప్రధాన బలమని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యకర్తల ముఖ్య బాధ్యత అని అన్నారు. కార్యకర్తల శ్రమ, త్యాగాల మీదే కాంగ్రెస్ పార్టీ నిలబడిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై జోక్యం చేసుకుంటే కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసం చివరి క్షణం వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అవకాశాల కోసం పార్టీని వాడుకునే వారిని, సందులు చూసి లాభపడాలనుకునే వారిని తీవ్రంగా విమర్శించారు.
తన ప్రసంగంలో రామాయణ, మహాభారతాల ఉదాహరణలు ఇచ్చిన ఆయన, ధర్మానికి కట్టుబడి ఉన్నవారే చివరికి విజయం సాధిస్తారని అన్నారు. పది తలలు ఉన్న రావణాసురుడే శ్రీరాముడి ముందు నిలబడలేకపోయాడని, ధర్మం వైపే ఎప్పుడూ విజయం ఉంటుందని గుర్తు చేశారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం అనంతరం మంచి రోజులు చూసినట్లే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అజ్ఞాతవాసంలో ఉన్నా త్వరలోనే శుభదినాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తలు, నాయకులు ఐక్యతగా ముందుకు సాగితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, కార్యకర్తల హక్కులను నిలబెట్టేందుకు అవసరమైతే చివరి వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

