GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?
హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను కలిపి మూడు కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 150 డివిజన్లు ఉన్న వాటిని ఇప్పుడు 300 డివిజన్లుగా మార్చారు. వీటిలో 100 డివిజన్లకు చొప్పున మూడు కార్పొరేషన్లుగా మార్చాలని భావిస్తున్నారు.
ముగ్గురు మేయర్లు..
ఇదే కనుక జరిగితే గ్రేటర్ హైదరాబాద్కు ముగ్గురు మేయర్లను ఎన్నుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో పాలకమండలి గడువు ముగుస్తుంది. ఆ తర్వాత 300 డివిజన్లను మూడు భాగాలుగా చేసే ప్రక్రియ మొదలు కానుంది. పరిపాలన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనే మూడు కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటికి మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ జులై నాటికి ఎన్నికలు నిర్వహించకపోతే 2027 వరకు జరగవని సమాచారం. ఎన్నికలు జరగకపోతే ఇంతలో జనగణన పూర్తవుతుందని.. ఆ కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.
ఇటీవల నగర పౌరులు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని జీహెచ్ఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డుల సరిహద్దులతో కూడిన ఓ మ్యాప్ను విడుదల చేసింది. ఇందులో ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల సరిహద్దులను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉంది. ఇంతకు ముందు జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడు అది 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించింది. త్వరలోనే హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ మహా నగరంగా తీర్చేదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మూడు కార్పొరేషన్లగా మార్చాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజించనుంది. అయితే హైదరాబాద్ జోన్ పరిధిలోకి శంషాబాద్ (17), రాజేంద్రనగర్ (29), చార్మినార్ (25), ఎల్బీనగర్ (24) డివిజన్లు వస్తాయి. సికింద్రాబాద్ జోన్ కింద సికింద్రాబాద్ (28), కుత్బుల్లాపూర్ (27), మల్కాజిగిరి (26), ఉప్పల్ (24) డివిజన్లను చేర్చారు. ఇక సైబరాబాద్ జోన్ పరిధిలో శేరిలింగంపల్లి (26), ఖైరతాబాద్ (25), గోల్కొండ (26), కూకట్పల్లి (23) డివిజన్లు ఉండే అవకాశం ఉంది.
ఇక అమీన్పూర్, మియాపూర్, నార్సింగి, పటాన్చెరు,కూకట్పల్లి, మదాపూర్, మూసాపేట, గాజులరామారం, శేరిలింగంపల్లి, అల్వాల్ కాలనీ, చింతల్, మేడ్చల్, కొంపల్లి, జీడిమెట్ల, మలక్పేట, మూసారంబాగ్, సంతోష్నగర్, నిజాంపేట, దిండిగల్, చార్మినార్, యూకుత్పురా, జవహర్నగర్, మల్కాజిగిరి, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, ఘట్కేసర్, కాప్రా, ఆదిభట్ల, బడంగ్పేట, జల్పల్లి, నాగోల్, సరూర్నగర్, బోడుప్పల్, శంషాబాద్, ముషీరాబాద్,గోల్కొండ, కార్వాన్, తార్నాక, మెట్టుగూడ, గోషామహల్, ఖైరతాబాద్, మాసబ్ట్యాంక్, అంబర్పేట, కవాడిగూడ, యూసుఫ్గూడ, బోరబండ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్పేట, అత్తాపూర్, చంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, ఫలక్నూమా, జంగంమెట్, బహదూర్పురా సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నారు.

