రాష్ట్రంలోని 34 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. వినకపోతే బెదిరింపులు, కొన్ని చోట్ల కిడ్నాప్ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు.
హంగ్ పరిస్థితులు ఏర్పడిన మున్సిపాలిటీల్లో కనీసం 10 చోట్ల అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత రాష్ట్ర సమితి నేతలు భావిస్తున్నట్లు తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో సిపిఐ కూటమిగా ఏర్పడిందని, సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు తాము సిపిఐకు మద్దతు ప్రకటించామని తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిలో దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని, 42% రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
హైదరాబాద్లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జెడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బీసీల డిమాండ్లపై కేంద్రంతో సరైన చర్చలు జరగలేదని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

