జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.
పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు కూడా చురుకైన పాత్ర పోషించాయి.
ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈ ఉపఎన్నికలో డ్రోన్లను వినియోగించడం విశేషం. మొత్తం 139 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 139 డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. అదనంగా, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్క్యాస్టింగ్ అమలు చేయడం ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టారు.
భద్రతా చర్యల పరంగా పోలీసులు కూడా గట్టి ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయబడింది. ప్రతి కేంద్రానికి 200 అడుగుల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యలతో పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరగడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మొత్తం నగరం దృష్టి సారించగా, ప్రజాస్వామ్య పండుగలా పోలింగ్ వాతావరణం నెలకొంది.

