నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతిఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై రేపటి నుంచి కఠిన చర్యలు

హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఈ నెల 24వ తేదీ శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. ఒక ఫర్నిచర్ షాప్‌కు సంబంధించిన భవనంలోని సెల్లార్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన ఫర్నిచర్, కుర్చీలు, ఫోమ్, స్పాంజ్ వంటి అత్యంత జ్వలనశీల పదార్థాలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో బయటకు రావడానికి అవకాశం లేక ఐదుగురు దుర్మరణం చెందారు.

సెల్లార్లలో వేల సంఖ్యలో ఫర్నిచర్ సామగ్రిని అక్రమంగా నిల్వ చేయడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవన యజమాని అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పట్టించుకోకుండా ఇన్‌ఫ్లామబుల్ మెటీరియల్‌ను భారీగా డంప్ చేయడంతో మంటలను నియంత్రించడం తీవ్రంగా కష్టతరమైంది.

అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్, హైడ్రా, జిహెచ్ఎంసి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా, ఫైర్ ఇంజిన్లు, ఇతర యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ప్రాణనష్టం జరిగింది.

ఫైర్ సేఫ్టీ ఆడిట్‌కు నిర్ణయం

ఈ దుర్ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న అన్ని వాణిజ్య భవనాలు, సెల్లార్లు, గోదాములు, షాపులపై తనిఖీలు చేపట్టనున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా జ్వలనశీల పదార్థాలు నిల్వ చేస్తున్న భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

రేపటి నుంచి సీజ్‌లు, విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్

ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉల్లంఘిస్తున్న భవనాలను రేపటి నుంచే సీజ్ చేస్తామని, చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని హైడ్రా, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించాయి. అవసరమైతే విద్యుత్ కనెక్షన్లను కూడా వెంటనే డిస్కనెక్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఫర్నిచర్, కెమికల్స్, మ్యాట్రెస్లు, గార్మెంట్స్ వంటి జ్వలనశీల వస్తువులను సెల్లార్లలో నిల్వ చేయడం తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు.

షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణం

చాలా అగ్నిప్రమాదాలకు చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌నే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అలాంటి సమయంలో భవనాల్లో ఇన్‌ఫ్లామబుల్ మెటీరియల్ ఉంటే అగ్ని వేగంగా వ్యాపించి, అరగంటలోనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంటుందని వివరించారు. అటువంటి పరిస్థితుల్లో లోపల ఉన్నవారి ప్రాణాలను కాపాడటం అత్యంత కష్టతరమవుతుందని పేర్కొన్నారు.

ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి

ఇలాంటి అక్రమ నిల్వలు, ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు తమ ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. వీడియోలు, ఫోటోలు, లొకేషన్ వివరాలు పంపితే తక్షణమే అధికారుల బృందాన్ని పంపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నాంపల్లి అగ్నిప్రమాదం తర్వాత నగరంలో ఫైర్ సేఫ్టీపై తీవ్ర చర్చ మొదలైంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో విస్తృత తనిఖీలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *