జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల విడుదలకు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
మొదటి రౌండ్ ముగిసేసరికి 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది.
రెండో రౌండ్ లో ఈ ఆధిక్యం 2,995 ఓట్లకు పెరిగింది.
మూడో రౌండ్ లో 3,000 పైచిలుకు మెజారిటీ నమోదు అయ్యింది.
నాల్గో రౌండ్ ముగిసేసరికి ఇది 9,467 ఓట్లకు చేరుకుంది.
ఐదో రౌండ్ ముగిసేసరి నవీన్ యాదవ్ 12,651 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు
కౌంటింగ్ సాగుతున్న కొద్దీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ నాయకులు ఫలితాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ:
“ప్రజలు అబద్ధ ప్రచారాలను నమ్మలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం పెట్టుకున్నారు. నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని ప్రజలు గౌరవించారు. షేక్పేట్, బోరబండ వంటి ప్రాంతాల్లోనూ మా ఆధిక్యం ఈరోజు ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది” అని అన్నారు.
విపక్షం రిగ్గింగ్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో CCTV, పోలీస్ బందోబస్తు సమగ్రంగా ఉన్న నేపథ్యంలో రిగ్గింగ్ ఆరోపణలు ప్రస్తుత పరిస్థితుల్లో అసంభవమని పేర్కొన్నారు.
అదే సమయంలో భద్రతా దృష్ట్యా జూబ్లీహిల్స్లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా సెంట్రల్ ఫోర్సులు మోహరించారు.
ఇప్పటికే 10 రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాతి ట్రెండ్ను పరిశీలిస్తే, నవీన్ యాదవ్ 25,000 నుంచి 30,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చివరి రౌండ్లలో కూడా ఇదే ధోరణి కొనసాగితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం నమోదు చేయనుంది.

