హైదరాబాద్ బార్ అసోసియేషన్ తరఫున ప్రతినిధులు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖపై కీలక ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బార్లు, వైన్ షాపులపై తీసుకొస్తున్న పాలసీలు, పర్మిట్ రూమ్ రూల్స్, వైన్ షాప్ టెండర్ విధానం—ఇవన్నీ చిన్న, మధ్య తరహా బార్ యజమానులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు తెలిపారు.
బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ—
తామంతా 1986 నుంచి ఈ రంగంలో వృత్తిపరంగా ఉన్నామని, ఒక్కడు సామాన్యుడూ బార్/వైన్ షాప్ వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తీవ్ర నష్టపోయిన బార్ యజమానులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని చెప్పారు.
పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా మారిన వ్యవస్థ
జీఓలు 24, 25, 26 ప్రకారం పర్మిట్ రూమ్ అనేది
- 100 స్క్వేర్ మీటర్లలోపే ఉండాలి,
- సిట్టింగ్ ఉండకూడదు,
- తినుబండారాలు ఉండకూడదు
అని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ… అధికారులు వాటిని పూర్తిగా నీరుగార్చి, రోడ్ల మీదే అనధికారిక సిట్టింగులు, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది.
దీంతో బార్ యజమానులు లైసెన్స్ ఫీజులు, జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ వంటి భారీ బాదుడ్లను భరిస్తుండగా, పర్మిట్ రూమ్లు మాత్రం అనధికారికంగా 24 గంటలా నడుస్తున్నాయని తెలిపారు.
“మేము లక్షలు కట్టి చట్టబద్ధంగా నడుపుతాం… వారు మాత్రం బెల్ట్ షాపులు నడిపుతున్నారు”
రెండు లక్షల నుంచి కోటి వరకు చెల్లించి లైసెన్స్ తీసుకునే బార్లు, వైన్ షాపులు ఒకరోజు బంద్ అయినా రెవెన్యూ కంపల్సరీగా కట్టాల్సిందే.
కానీ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు మాత్రం
- ఎలాంటి టాక్స్ లేదు
- ఎలాంటి లైసెన్స్ లేదు
- ఎవరికీ జవాబుదారి లేదు
అని అసోసియేషన్ తీవ్రంగా ఆక్షేపించింది.
వైన్ షాప్ డిస్టెన్స్ నిబంధన అమలు చేయాలి
గుడి, బడి, మసీదు, జడ్జి కార్యాలయం వంటి చోట్లనుంచి 100 మీటర్ల దూరం పాటించాలి అనే “రూల్-6” గతంలో కఠినంగా ఉన్నప్పటికీ… ఇప్పుడు వైన్ షాపులు పక్కపక్కనే, మార్కెట్లా వరుసగా పెరుగుతున్నాయని, ఇది బార్ల రెవెన్యూపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఎక్సైజ్ శాఖలో కమిషన్లు?
పర్మిట్ రూమ్లను కంట్రోల్ చేయకపోవడంలో ఎక్సైజ్ శాఖ పాత్రను కూడా ప్రశ్నించారు. “గవర్నమెంట్ రెవెన్యూకి నష్టం అవుతుందని చెప్పి కింది స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అసలు బెల్ట్ షాపులు ఏం రెవెన్యూ ఇస్తాయి?” అంటూ అసోసియేషన్ ప్రశ్నించింది.
హైకోర్టులో పిటిషన్
పర్మిట్ రూమ్ రూల్స్ అమలు చేయకపోవడంపై త్వరలో హైకోర్టులో పిటిషన్ వేస్తామని, చట్టాన్ని అమలు చేయని అధికారుల బాధ్యత నిర్ధారించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
బీసీ పొలిటికల్ ఫ్రంట్–సేవాభావం
రాజకీయంగా కూడా సేవాభావంతో ముందుకెళ్లాలని, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. గౌడ కులవృత్తులు, 25% రిజర్వేషన్, కొత్త ప్రభుత్వ హామీలను అమలు చేయించాలన్నది తమ లక్ష్యమని వివరించారు.
లిక్కర్ వ్యాపారం గతం నుంచి గౌడల వృత్తి కావడంతో ఈ రంగంలో గౌడ సమాజానికి న్యాయం జరిగేలా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

