సంక్రాంతి తర్వాత హాస్టల్స్‌లో చేపలకూర – మత్స్యకారుల కోసం కొత్త బీమా పథకం

రాష్ట్రంలో మత్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వ హాస్టల్స్‌తో పాటు క్రీడా పాఠశాలల్లోనూ చేపలకూర వడ్డించే నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ను కొత్త ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి తీసుకురావడానికి సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,152 సంఘాల్లో సభ్యులుగా నమోదు చేసుకున్న 4.21 లక్షల మత్స్యకారులకు బీమా పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమా తరహాలో అమలుచేయనున్న ఈ పథకంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుందని అధికారులు తెలిపారు.

ఈ పథకం ప్రకారం:

  • సాధారణ మరణం లేదా ప్రమాద మరణం: ₹5 లక్షలు
  • శాశ్వత వైకల్యం: ₹5 లక్షలు
  • పాక్షిక వైకల్యం: ₹2.5 లక్షలు

ఇది అమల్లోకి వస్తే మత్స్యకారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. అంతేకాకుండా కోహెడ ఎదురుగా అత్యాధునిక చేపల మార్కెట్ నిర్మాణం, “తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్” రూపకల్పన వంటి ప్రణాళికలు కూడా వేగంగా సాగుతున్నాయి.

అయితే ప్రజల్లో సందేహం మాత్రం అలాగే ఉంది — పథకాలు కాగితాల్లోనే ఆగిపోతాయా? లేక నిజంగా అమలు అవుతాయా?

హాస్టల్స్, క్రీడా పాఠశాలల్లో చేపలకూర ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందితే అది అభినందనీయం. కానీ కాంట్రాక్టర్ల అవినీతి, బిల్లులు నిలిపివేత, నాణ్యత సమస్యల వంటి గత అనుభవాలు విద్యార్థులను మరోమారు బలిపశువులుగా మారుస్తాయా అన్నది చూడాలి.

ప్రభుత్వంపై విశ్వాసం నిలబడాలంటే — ప్రకటించిన పథకాలు నిజంగా అమలు కావాలి, కేవలం పేపర్ స్టేట్మెంట్లుగా కాకుండా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *