నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా బాధాకరమైన రోజు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉండగానే మహిళా కానిస్టేబుల్ సౌమ్య దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను పట్టుకునే ప్రయత్నంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సౌమ్య గారు ఎంతో సిన్సియర్గా, బాధ్యతతో విధులు నిర్వహించే పోలీస్ అధికారి. గంజాయి ముఠా తప్పించుకునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చివరకు ఆమె తుదిశ్వాస విడిచారు. సమాజాన్ని రక్షించాలనే తపనతో తన ప్రాణాలనే అర్పించిన ఈ ఘటన ప్రతి ఒక్కరి మనసును కలచివేసింది.
సౌమ్య మరణం పోలీస్ శాఖలోని మహిళా సిబ్బంది ధైర్యానికి నిదర్శనం. ఆమె డ్యూటీ చేసింది, తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. ఇటువంటి నిజాయితీగల పోలీస్ అధికారులకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఆమె సర్వీస్ కాలానికి సంబంధించిన వేతనం చెల్లించడంతో పాటు, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిన్న అంత్యక్రియలు జరగగా, వేలాది మంది కన్నీటి నివాళులు అర్పించారు.
సౌమ్య సినిమా హీరోయిన్ కాదు… ఆమె నిజ జీవిత హీరోయిన్. ఒక మహిళగా, ఒక పోలీస్ అధికారిగా దుండగులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించింది. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆమె ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో వీరమరణం పొందిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యకు తెలంగాణ సమాజం తరఫున ఘన నివాళులు. 🙏

