అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు, భారతీయుల సమస్యల పరిష్కారానికి హ్యూస్టన్లో ప్రత్యేక సభ నిర్వహిస్తున్నట్లు ఒక సామాజిక కార్యకర్త ప్రకటించారు. జూన్ 14న హ్యూస్టన్లోని ఇన్స్పైర్ సెంటర్లో ఈ సమావేశం జరగనుందని తెలిపారు.
అమెరికాలో వీసాలు, గ్రీన్ కార్డులు, ఇమ్మిగ్రేషన్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలు, భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థి వీసాలపై ఉన్నవారు, గ్రీన్ కార్డు ప్రక్రియలో ఉన్నవారు, చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నవారు తమ సమస్యలను తీసుకురావాలని సూచించారు.
అమెరికాలో నివసిస్తున్న అనేక మంది భారతీయులు ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, అలాంటి వారు ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలకు పరిష్కారం కోసం చట్టబద్ధ మార్గాలను అనుసరించాలని సూచించారు.
అమెరికా రాజకీయ నాయకులతో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఇమ్మిగ్రేషన్ అంశాలపై చర్చలు జరిపినట్లు పేర్కొన్న ఆయన, త్వరలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హ్యూస్టన్లో జరిగే ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలతో ఉన్న ప్రవాస భారతీయులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని, ప్రవాస భారతీయుల సమస్యలను వినడం మరియు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అమెరికాలోని తెలుగు, భారతీయ సమాజానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ సమావేశం నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

