పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి.
కర్ణాటకలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల చదువు, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
పిల్లల్లో సోషల్ మీడియా అతివాడకం వల్ల అభ్యాసన సామర్థ్యం దెబ్బతింటోందని, చదువుపై దృష్టి తగ్గుతున్నదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 90 రోజుల్లో విధి విధానాలను రూపొందించి అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. టెక్నాలజీ వినియోగం అవసరమే అయినప్పటికీ, చిన్నారులపై దాని ప్రభావాన్ని ఎలా నియంత్రించాలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

