జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్చైర్లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు.
తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు మాత్రం ఇళ్లలో కూర్చుంటే ఎలా?” అని ప్రశ్నించారు.
ఆమె మాటలు అక్కడ ఉన్న ఓటర్లలో ఉత్సాహం నింపాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని ఈ వృద్ధురాలు తన చర్యలతో మరొకసారి నిరూపించారు.

