ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనల అమలులో ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు. అవసరం ఉన్న చోట మాత్రమే చలాన్లు విధించాలని, కానీ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎలాంటి రాజీ ఉండదని, రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో సుమారు 3 శాతం నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

సరిహద్దుల్లో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే సైనికుల కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వ అజెండాగా తీసుకుంటామని, తెలంగాణను రోడ్డు భద్రతలో దేశానికి మార్గదర్శక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే వాహనం ఎవరి పేరుపై ఉందో వారి మీదే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 26 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోజుకు సగటున 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఈ మరణాల సంఖ్యను శూన్యానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

అయితే, ట్రాఫిక్ చలాన్లను కఠినంగా అమలు చేయడంతో పాటు రోడ్ల పరిస్థితి కూడా మెరుగుపడాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. గుంతలు, సరిగా లేని యూటర్న్లు, అసంపూర్తి రోడ్డు పనులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. వసూళ్లతో పాటు రోడ్డు మౌలిక సదుపాయాలపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మొత్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రోడ్డు భద్రతను ఎంతవరకు మెరుగుపరుస్తాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *