అసభ్య వ్యాఖ్యలు, మీడియా వికృతీకరణలతో రేప్ కల్చర్ పెరుగుతోంది: మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ తీవ్ర విమర్శ

ఇటీవలి కాలంలో జరుగుతున్న టీవీ చర్చలు, సోషల్ మీడియా డిబేట్లు ఎంతగా వక్రీకరణకు గురవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమేనని మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు, అసభ్య వ్యాఖ్యలు చేయడం, వాటిని మీడియా చిలవల పలవలుగా మార్చి ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.

సంధ్యారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ

కాంగ్రెస్ పార్టీకి చెందిన సంధ్యారెడ్డి ఒక నటుడిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత అంగీకారం లేకుండా ఫోటోలు ఉపయోగించి సోషల్ మీడియాలో వికృతమైన థంబ్‌నెయిల్స్ పెట్టడం స్త్రీల శరీరాలను దుర్మార్గంగా వాడుకోవడమేనని విమర్శించారు.
ఇలాంటి చర్యలు స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను తగ్గించకపోగా, సమాజంలో రేప్ కల్చర్‌ను మరింత పెంచుతున్నాయని స్పష్టం చేశారు.

NCRB గణాంకాలు చెబుతున్న నిజం

నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం,
2022–23 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా స్త్రీలపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై జరిగిన దాడులు 9 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని గ్రూప్ గుర్తుచేసింది.
ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదని, మొత్తం వ్యవస్థ ఇచ్చిన డేటా అని పేర్కొన్నారు.

మాటలతోనే మొదలయ్యే హింస

రేప్ కల్చర్ అనేది కేవలం భౌతిక హింసతోనే కాదు, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా కూడా పెరుగుతుందని చెప్పారు.
అత్యంత దారుణమైన ఘటనలు జరిగితే తప్ప, మిగతావన్నీ “సహజమే” అన్న స్థాయికి వెళ్లిపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.

రాజకీయ నాయకుల బాధ్యత

రాజకీయ ప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని గ్రూప్ స్పష్టం చేసింది.

తమను తాము “సంస్కృతి పరిరక్షకులు”గా చెప్పుకుంటూ అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు ఎవరూ అంగీకరించరని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల కారణంగానే సంధ్యారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం జరిగిందని తెలిపారు.
నోరు జారిన నటుడిని తప్పుబట్టకుండా, చర్యలు తీసుకున్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై కూడా సంధ్యారెడ్డి తీవ్రంగా మాట్లాడటం మరింత దురదృష్టకరమని విమర్శించారు.

వ్యవస్థాపరమైన మార్పు అవసరం

స్త్రీలపై కుటుంబపరంగా, సమాజపరంగా, వృత్తిపరంగా జరుగుతున్న హింస, వర్క్‌ప్లేస్ హింస వంటి వాటిని అడ్డుకోవాలంటే
ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గత మూడు ఎన్నికల సందర్భంగా మహిళా–ట్రాన్స్‌జెండర్ సంఘాల తరఫున మేనిఫెస్టోను
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామని వెల్లడించారు.
అయినప్పటికీ రాజకీయ లాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

స్పష్టమైన హెచ్చరిక

స్త్రీలపై జరుగుతున్న వ్యవస్థాపరమైన హింసను అడ్డుకోవాలంటే
రాజకీయ పార్టీలు తమ రాజకీయ సంస్కృతిలోనే మార్పు తీసుకురావాలని,
ఆచరణలో చూపించాలని మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో
తేజస్విని మాడభూషిని మాట్లాడాలని కోరుతూ సమావేశాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *