తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్మన్పై చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారం చేతికి వచ్చాక ఆగ్రహం, అసహనం పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
ముఖ్యమంత్రి గన్మన్ను కొట్టడం ఏ రకమైన ఆనందమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఓడిపోయిన సర్పంచులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న పరిస్థితులకు, ముఖ్యమంత్రి ప్రవర్తనే ప్రేరణగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామంలో గెలిచిన సర్పంచ్, ఆమె భర్తపై జరిగిన దాడి ఉదంతం ఈ హింసాత్మక రాజకీయాలకు నిదర్శనంగా చూపుతున్నారు. ఆ ఘటనలో బాధితుడు కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
చిన్న స్థాయి సర్పంచ్ ఎన్నికలకే దాడులు, హింస అవసరమా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా భద్రతా సిబ్బందిపై చేయి చేసుకుంటే, కిందిస్థాయి నాయకులు కూడా అదే బాటలో నడవడం సహజమని విమర్శలు వస్తున్నాయి
.గన్మన్లు రాజకీయ నాయకుల వ్యక్తిగత భద్రతకే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి నాయకులను కాపాడే బాధ్యతలో ఉంటారని వ్యాఖ్యాతలు గుర్తు చేస్తున్నారు. అలాంటి గన్మన్లను మనుషుల్లా కూడా చూడకుండా దుర్వినియోగం చేయడం అమానుషమని మండిపడుతున్నారు. చాలామంది నాయకులు లోపల భోజనాలు చేస్తుంటే, బయట గన్మన్లు తిన్నారా లేదా అన్న కనీస ఆలోచన కూడా చేయరన్న విమర్శలు ఉన్నాయి.
“గన్మన్ లేకుండా, ట్రాఫిక్ ఆపించకుండా ఒక సాధారణ వ్యక్తిలా బయట తిరిగే ధైర్యం ఉందా?” అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ, హుందాతనం కుర్చీకే కాదు కుర్చీలో కూర్చున్న వ్యక్తికీ ఉండాలని హితవు పలుకుతున్నారు.
రాజకీయ నాయకులు గన్మన్లను తమకంటే తక్కువగా కాకుండా, సమానమైన గౌరవంతో చూడాలని, వారి మౌలిక అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పలువురు సూచిస్తున్నారు. గన్మన్లపై దాడులు రాజకీయ సంస్కృతికి మచ్చగా మిగులుతాయని, ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పి హుందాతనాన్ని కాపాడుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

