చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ నెట్వర్క్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం చేస్తూనే లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్ చేసుకుని మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సుష్మిత, ఇమాన్యుల్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, OG కుష్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రగ్స్ సరఫరా కోసం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లను ఉపయోగించి కస్టమర్లను సంప్రదించడం, హోమ్ డెలివరీ తరహాలో డ్రగ్స్ సరఫరా చేయడం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా నిర్వహిస్తూ, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు తెలిపారు.
ఈ కేసులో కీలక నిందితులైన సుష్మిత, ఇమాన్యుల్లను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన డీలర్లు ఎవరు, నగరానికి మత్తుపదార్థాలు ఎలా చేరుతున్నాయన్న అంశాలపై ప్రత్యేక బృందాలతో లోతైన విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

