తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు – సాహితీ లోకానికి తీరని లోటు

తెలంగాణ గీత రచయిత, ప్రజా కవి, ఉద్యమకారుడు అందశ్రీ (అసలు పేరు అందే ఎల్లయ్య) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గాంధీ ఆసుపత్రి హెచ్‌ఓడీ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆయన మరణించారు. గత ఐదేళ్లుగా హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ, గత నెల రోజులుగా మందులు వాడలేదని తెలిపారు. డాక్టర్ సింధూర తెలిపిన ప్రకారం, మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నా వైద్యుడిని సంప్రదించలేదని పేర్కొన్నారు.

1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్త గ్రామంలో జన్మించిన అందశ్రీ, తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పెట్టిన కవుల్లో ఒకరు. ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది. ఈ గీతం తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిలో ఆత్మవిశ్వాసాన్ని, ఏకత్వాన్ని నింపింది.

అందశ్రీ తన సాహిత్య జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు.

  • 2006లో గంగా సినిమాకు నంది అవార్డు
  • 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్
  • 2015లో దశరథి సాహితీ పురస్కారం మరియు రావోరి భగద్వాజ్ సాహితీ పురస్కారం
  • 2022లో జనకమ్మ జాతీయ పురస్కారం
  • 2024లో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం మరియు లోకనాయక పురస్కారం
    వంటి గౌరవాలు అందుకున్నారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల పురస్కారం ప్రకటించి సత్కరించింది. కాకతీయ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ సీఎం కేసీఆర్ అందశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అందశ్రీ మరణం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఒక తీరని లోటుగా మిగిలింది. ఆయన రాసిన గీతాలు, కవితలు, భావాలు ఎప్పటికీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *