క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది.

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించే వ్యాఖ్యలు చేయకండి” అని మంత్రి వర్గానికి హితవు పలికారు.

కొండా సురేఖ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదం కూడా ఈ మీటింగ్‌లో ప్రధాన చర్చగా నిలిచింది. కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తూ, “మాదంతా ఒకే కుటుంబం. కానీ బహిరంగంగా మాట్లాడితే ప్రజల్లో ప్రతికూల భావన కలుగుతుంది” అని సీఎం పేర్కొన్నారు.

మంత్రులు పబ్లిక్‌లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని రేవంత్ స్పష్టంగా చెప్పారు. “మీ లాభాల కోసం, వ్యక్తిగత ఎజెండా కోసం ప్రజల్లో చులకన అవ్వకండి. పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే రేపు ప్రజలే నిలదీస్తారు” అని ఆయన హెచ్చరించారు.

అదే సమావేశంలో ఐఏఎస్ అధికారి రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) అంశం కూడా చర్చకు వచ్చింది. “ఎనిమిదేళ్లు సర్వీస్ మిగిలి ఉన్న అధికారి ముందుగా విఆర్ఎస్ తీసుకుంటే దానికి కారణం తప్పకుండా ఉంటుంది” అని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు చేసిన వివరణ “నాకు ప్రైవేట్ ఆఫర్ వచ్చింది” అని చెప్పడం పై కూడా మంత్రులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

మొత్తానికి, రేవంత్ రెడ్డి ఈ సమావేశం ద్వారా రెండు స్పష్టమైన సందేశాలు ఇచ్చారు —
1️⃣ పార్టీ లోపల ఐక్యత తప్పనిసరి
2️⃣ ప్రజల ముందు చులకనగా కనిపించే ప్రవర్తన అస్సలు సహించబోమని

రాష్ట్ర కేబినెట్ నిర్ణయం: ఇకపై మంత్రులు లేదా ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించినప్పుడు పూర్తి వివరాలతో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్న నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *