తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్లో బీసీ బిల్లుల ప్రస్తుత స్థితిపై ప్రశ్నించగా, కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇస్తూ ఆ బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ అంశంపై కనీసం అధికారిక స్థాయిలో స్పష్టత రావడంతో బీసీ వర్గాల్లో కొంత ఊరట కనిపిస్తోంది.
తెలంగాణలో బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది.
కేంద్రం వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం బిల్లులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కులగణన సర్వే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ వివరాల ఆధారంగా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు కూడా ఉండే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తక్షణమే 42% రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన సర్వే పూర్తయ్యాకే తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే లెక్కలపై కూడా వివాదం నెలకొంది. సర్వే ఫలితాలను పూర్తిగా పబ్లిక్ డొమైన్లో ఉంచకపోవడం, బీసీల శాతం విషయంలో భిన్న గణాంకాలు రావడం వంటి అంశాలు సందేహాలకు దారి తీస్తున్నాయి. బీసీ వర్గాలు తమ జనాభా శాతం మరింత ఎక్కువగా ఉందని వాదిస్తున్నాయి.
సర్వేలో అందరూ పాల్గొనలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయి డేటా లేకుండా శాతాలను ఎలా నిర్ధారించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన సర్వే పూర్తి వివరాలను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
సర్వే లెక్కలు పారదర్శకంగా వెల్లడిస్తేనే బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వస్తుందని, లేకపోతే ఈ విషయం ఇంకా పరిశీలన దశలోనే కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

