హైదరాబాద్లోని వెంగలరావు నగర్లో మౌలిక సదుపాయాల లేమిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్నామని, ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కొరత, పాడైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల లేమి వంటి సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
స్థానిక మహిళ మాట్లాడుతూ, “50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. తాగునీరు సరిగా రావడం లేదు. వచ్చినా రెండు మూడు బిందెలకే పరిమితమవుతోంది. మిగతా అవసరాల కోసం డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సి వస్తోంది. అధికారులు వచ్చి చూస్తామని చెబుతారు కానీ సమస్య మాత్రం అలాగే ఉంది” అని వాపోయారు.
కాలనీలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, నడవడానికి కూడా వీలు లేకుండా గుంతలతో నిండిపోయాయని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ పైపులు, తాగునీటి పైపులు ఒకదానికొకటి కలిసే పరిస్థితి ఉందని, దీంతో నీటి కలుషితంపై భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు.
వీధి దీపాల సమస్య కూడా తీవ్రంగానే ఉందని, రాత్రి సమయంలో చాలా వీధుల్లో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెలగడం లేదని, దీంతో మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. దొంగతనాలు, కుక్కల బెడద వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.
కాలనీ సమస్యలపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపించారు. కార్పొరేటర్ను పలుమార్లు కలిసి సమస్యలు వివరించినా హామీలకే పరిమితమయ్యారని, పనులు మాత్రం జరగలేదని విమర్శించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానికులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “ఈసారి సమస్యలు పరిష్కరించకపోతే ఓటు వేయం. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతారు. గెలిచిన తర్వాత మా కాలనీ వైపు కూడా చూడరు. రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాతే మా ఓటు గురించి ఆలోచిస్తాం” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వెంగలరావు నగర్లో తాగునీటి సరఫరా మెరుగుపరచడం, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం, పాడైన రోడ్లను పునర్నిర్మించడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు స్థానికుల ప్రధాన డిమాండ్లుగా మారాయి. ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

