సోషల్ మీడియా మరియు ప్రధాన మీడియా వేదికలలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి ఒక గాయకుడు తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, నిజానిజాలు బయటకు రావాలని కోరారు.
“నాకు పాటల ప్రపంచం తప్ప ఇంకేమీ తెలియదు. దయచేసి ఎవరూ నన్ను నమ్మకండి, ముందుగా వాస్తవాలు తెలుసుకోండి. ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి,” అని ఆయన ప్రజలను కోరారు.
మీడియా ప్రచురిస్తున్న వార్తల కింద వస్తున్న కామెంట్లు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపారు. “నా వల్ల కావట్లేదు. నేను తప్పు చేసి ఉంటే ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం. పోలీస్ స్టేషన్కి రావడానికైనా, జైలుకి వెళ్లడానికైనా రెడీ,” అని అన్నారు.
ఈ ఘటనలో బాధితుల పట్ల తనకు ఉన్న అనుభూతిని వ్యక్తం చేస్తూ, “వాళ్ల పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని నేను, ఆ బాధ నాకు తెలుసు,” అని పేర్కొన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
“ఫెయర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బాధితులకు న్యాయం కావాలి. నా పేరుతో డబ్బులు తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలి,” అని ఆయన అన్నారు.
అలాగే తన కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగవద్దని వేడుకున్నారు. “నా ఫోటోలు వాడకండి. నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. మా అమ్మ, నాన్న చాలా బాధపడుతున్నారు,” అని భావోద్వేగంగా తెలిపారు.
మీడియా బాధ్యతను గుర్తుచేస్తూ, “మీరు చూపించే దానిపై ప్రజలు నమ్మకం పెడతారు. దయచేసి నిజాలు మాత్రమే చూపించండి. సోషల్ మీడియా లేకపోతే నేను లేను, కానీ తప్పుగా చూపించకండి,” అని విజ్ఞప్తి చేశారు.
చివరిగా, బాధితులకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని, నిజం బయటపడే వరకు పోరాడతానని తెలిపారు. “నేను మళ్ళీ నా పాటలతో మీ ముందుకు వస్తాను,” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

