జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వరదలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కొనసాగుతున్నా, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు.
వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు చేరి బియ్యం, పప్పులు, గృహసరుకులు పాడైపోతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని వేదన వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ — ఎవ్వరూ మా గల్లీ లోకి రాలేదు” అంటూ ప్రజలు ఆగ్రహంగా పేర్కొన్నారు.
కొంతమంది ఇంకా తీవ్రంగా మాట్లాడుతూ —
“ఎన్నికలప్పుడు మాత్రమె వస్తారు… తర్వాత కనిపించరు. ఈసారి ఎవరికీ ఓటు వేయం.”
మహిళలు కూడా తమ అసహనం స్పష్టంగా తెలిపారు:
“వర్షాలు వస్తే బయటికి రావడం కష్టం. ఇండ్లలో నీళ్లు, బయట దోమలు… ఎవ్వరు పట్టించుకోరు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం.”
ఉప ఎన్నికల సందర్భంలో పార్టీలు ఓట్లు కోరుకునే దశ దగ్గరపడుతుండగా, స్థానికుల ఈ నిరాశ, అసంతృప్తి నాయకులకు పెద్ద సవాలుగానే కనిపిస్తోంది.

