హర్యాణాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సొంత రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
పూరణ్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హర్యాణాలో ఏడీజీపీగా పనిచేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యలో ప్రతిభావంతుడు, ఐఐఎం అహ్మదాబాద్ నుండి కంప్యూటర్ సైన్స్లో చదువుకున్నారు. నిజాయితీ, క్రమశిక్షణతో పేరు తెచ్చుకున్న ఈ అధికారి, పై అధికారుల వేధింపులతో జీవితాన్ని ముగించారు.
ఆత్మహత్యకు ముందు భార్య అమనీత్ (ఐఏఎస్)కు పంపిన సందేశంలో “ఉన్నతాధికారుల వేదింపులు ఇక భరించలేను, నా చావుతో అయినా వాళ్ల ప్రవర్తన మారాలి. దళితులు ఇబ్బంది పడకూడదు” అని పేర్కొన్నారు. తనకు ప్రమోషన్లు ఇవ్వకుండా వివక్ష చూపారని, సెలవులు నిరాకరించారని, నివాస కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆయన సూసైడ్ నోట్లో వ్రాశారు.
డిజీపి శత్రుజిత్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజార్నియా సహా ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులపై పూరణ్ కుమార్ కులం పేరుతో అవమానించారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆయన భార్య అమనీత్, ఈ ఘటనకు కారణమైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటన భారత పరిపాలనా వ్యవస్థలో కుల వివక్ష ఇంకా మిగిలే ఉందని ప్రశ్నించేట్టుగా మారింది.

