తెలంగాణలో జరుగుతున్న జనగణన (Census) ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర జనాభాపై కొత్త చర్చ ప్రారంభమైంది. జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో ఇప్పటివరకు దాదాపు కోటి ఇళ్లలో వివరాలు సేకరించగా, 3.86 కోట్ల జనాభా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సుమారు 20 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి కావాల్సి ఉండటంతో రాష్ట్ర జనాభా 4 కోట్ల మార్క్ను దాటే అవకాశముందని చెబుతున్నారు.
అయితే ఇదే సమయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన (Caste Survey) నివేదికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ జనాభా సుమారు 3.52 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు జనగణనలో 4 కోట్లకు పైగా జనాభా ఉండవచ్చని అధికారులు చెబుతుండటంతో రెండు సర్వేల మధ్య దాదాపు 50 లక్షల మందికి పైగా వ్యత్యాసం కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.
ఈ వ్యత్యాసం కారణంగా కులగణన ఆధారంగా రూపొందించిన సామాజిక వర్గాల జనాభా శాతం, రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని అప్పట్లో వచ్చిన అభ్యంతరాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే సజావుగా సాగుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసవి సెలవుల కారణంగా అనేక కుటుంబాలు ప్రయాణాల్లో ఉండటం, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల సిబ్బంది ఒకే ఇంటికి పలుమార్లు వెళ్లాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు పెరగడంతో సర్వే పని మరింత క్లిష్టంగా మారింది.
మరోవైపు కులగణన సమయంలో అడిగిన కొన్ని ప్రశ్నలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందని, అదే కారణంగా ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో కూడా కొందరు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఇతర డేటా సేకరణపై అప్పట్లో వచ్చిన విమర్శల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే జనగణన అనేది దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలకు ఆధారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తేనే రాష్ట్ర జనాభాపై స్పష్టమైన చిత్రం బయటపడుతుందని అధికారులు సూచిస్తున్నారు.
జూన్ 9 నాటికి హౌస్ లిస్టింగ్ సర్వే పూర్తయ్యే అవకాశం ఉండగా, తుది గణాంకాలు వెలువడిన తర్వాత తెలంగాణ జనాభాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు కులగణన మరియు జనగణన గణాంకాల మధ్య ఉన్న వ్యత్యాసంపై రాజకీయ, సామాజిక చర్చలు కొనసాగనున్నాయి.

