ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ ముందుకొచ్చింది.
మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రైతు సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, మేధావుల సమావేశాలు, టిఫిన్ బైఠక్లు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా “స్వచ్ఛ పాఠశాల – మన బాధ్యత” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రజాప్రతినిధులు కలిసి పాఠశాలలను శుభ్రపరిచారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గతంలో “మోదీ గిఫ్ట్” పేరుతో వేలాది సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లు అందించడంతో పాటు, వారి పరీక్ష ఫీజులను తన సొంత వేతనం నుంచి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు గ్రామాల వారీగా అవగాహన ర్యాలీలు నిర్వహించి, పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన సహకారం అందించాలని కోరారు.

