ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర కీలకం.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్: రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ ప్రక్రియలో పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగిపోకుండా పర్యవేక్షించే బాధ్యతలను బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) నిర్వహిస్తున్నారు.
దాదాపు 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్లు, పార్టీ మద్దతుదారుల వివరాలపై పూర్తి అవగాహన ఉన్న సీనియర్ కార్యకర్తలను రాజకీయ పార్టీలు బీఎల్ఏలుగా నియమిస్తున్నాయి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి వస్తే, సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అవసరమైన ఆధారాలు సమర్పించి ఓటరు జాబితాలో పేర్లు కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఈ కార్యక్రమంలో పూర్తి సమయం కేటాయించాల్సి వస్తున్నందున కొందరు బీఎల్ఏలు తమ వ్యక్తిగత పనులు వదిలి పనిచేయాలంటే తగిన ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను కోరుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ అంశం పలువురు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా మారిందని చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.
ఈ నేపథ్యంలో ఓటర్లు కూడా తమ పేర్లు ఓటరు జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని రాజకీయ నాయకులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. ఓటరు పేరు తొలగిపోతే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలతో సవరణ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు కావడంతో ప్రతి ఓటరు తన ఓటు నమోదు, వివరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యం చేయరాదని సూచనలు వ్యక్తమవుతున్నాయి.

