హైదరాబాద్: భూ స్వాధీనం నేపథ్యంలో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లబోమంటూ పలువురు రైతులు, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన చర్చలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
“మేము 50 సంవత్సరాలకు పైగా ఈ భూమిపైనే జీవిస్తున్నాం. మా తాతలు, తండ్రులు ఈ భూమిని సాగు చేశారు. ఇప్పుడు ఈ భూమి అక్రమమని చెబితే, మాకు ఇచ్చిన వారిని ప్రశ్నించాలి కానీ మమ్మల్ని ఎందుకు వెళ్లగొడుతున్నారు?” అని వారు ప్రశ్నించారు.
తమకు అదనపు భూమి అవసరం లేదని, ప్రస్తుతం సాగు చేస్తున్నంత భూమిని మాత్రమే తమ వద్ద ఉంచాలని కోరారు. “మా జీవనాధారం ఈ భూమే. మా కుటుంబాల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ భూమిని వదిలేయమంటే మాకు బతుకు లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మేము గొడవపడటం లేదు. మిమ్మల్ని వేడుకుంటున్నాం. పోలీసులను పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపినా సిద్ధమే. కానీ మా భూమిని మాత్రం వదిలిపెట్టం. అవసరమైతే ఈ భూమి కోసమే ప్రాణాలు ఇస్తాం” అని స్పష్టం చేశారు.
తమ కుటుంబాలు తరతరాలుగా ఇదే భూమిపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రత్యామ్నాయ పరిష్కారం చూపకుండా ఖాళీ చేయాలని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

