తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో తెలంగాణ కూడా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 3 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం 58 శాతం మ్యాపింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. దీంతో పూర్తి స్థాయి పరిశీలన పూర్తయితే ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాల్లో తెలంగాణ జనాభా సుమారు 3 కోట్ల 53 లక్షలుగా పేర్కొనడం, ఇప్పుడు ఓటర్ల సంఖ్యే 3 కోట్ల 39 లక్షలు ఉండటం అనేక సందేహాలకు దారితీస్తోంది. ఇంకా 40 శాతం వరకు ధృవీకరణ ప్రక్రియ మిగిలి ఉండటంతో అసలు తుది లెక్కలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

