ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు.
అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఎన్నికల రోజును సెలవు దినంగా భావించి ఓటు వేయకుండా ఉండడం సరైనది కాదని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే భవిష్యత్తులో అభివృద్ధి జరిగినా, జరగకపోయినా పాలకులను ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతారని హెచ్చరించారు.
ప్రజలు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని, అందువల్ల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
వికారాబాద్ పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని మంచి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పునరుద్ఘాటించారు.

