హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి ఫార్మ్ హౌస్ యజమాని సహా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పార్టీకి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని ఎస్వా అధికారులు స్పష్టం చేశారు.
ఈ బర్త్డే పార్టీకి సంబంధించి వైఎస్సార్సీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. పార్టీకి అనుమతి లేదన్న విషయమై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “పార్టీకి పర్మిషన్ ఉందా లేదా అనేది తెలియదంటూ చెప్పడం సరైంది కాదు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు చట్టాలు తెలియవా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్, రీల్స్, సెలబ్రిటీ కల్చర్ పేరుతో చట్టాలను అతిక్రమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫార్మ్ హౌస్ పార్టీలు, డ్రగ్స్, హుక్కా, విదేశీ మద్యం అంశాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్వా పోలీసులు హెచ్చరించారు. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

