హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగి చేపట్టిన “ఆపరేషన్ పోకిరి” ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో మహిళలు ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె సివిల్ డ్రెస్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒంటరిగా నిలబడి షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
మే 1న బాధ్యతలు చేపట్టిన సీపీ సుమతి అదే రోజు రాత్రి ఈ సాహసోపేత ఆపరేషన్ నిర్వహించారు. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా కేవలం కొద్దిమంది భద్రతా సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 12 గంటలకు దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ తన సిబ్బందిని దూరంగా ఉండమని చెప్పి సాధారణ మహిళలా రోడ్డుపై నిలబడ్డారు.
అక్కడి నుంచి మొదలైంది అసలు భయానక వాస్తవం. ఆమె ఒంటరిగా కనిపించగానే వరుసగా యువకులు దగ్గరకు వచ్చి “వస్తావా?”, “నీ రేట్ ఎంత?” అంటూ అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించారు. కొందరు ఆమె వెనకాల నడుస్తూ కామెంట్లు చేయగా, మరికొందరు టచ్ చేయడానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు దాదాపు 40 మంది యువకులు ఆమెను వివిధ రకాలుగా వేధించినట్లు తెలిసింది.
ఈ మొత్తం ఘటనను సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది వీడియోగా రికార్డు చేశారు. అయితే ఈ మూడు గంటల వ్యవధిలో ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా ఆ ప్రాంతంలో కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం రాత్రిపూట గస్తీ తిరగాల్సిన పోలీసులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ముఖ్యంగా దిల్సుఖ్నగర్ వంటి రద్దీ ప్రాంతంలో, మెట్రో స్టేషన్ సమీపంలో ఒక మహిళను గంటల తరబడి వేధిస్తున్నా పోలీసులు అక్కడికి రాకపోవడం పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యాన్ని బయటపెట్టిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారుజామున 3:30 సమయంలో అక్కడికి వచ్చిన ఒక బీట్ కానిస్టేబుల్ ఆమెను గుర్తించి సెల్యూట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే అక్కడ ఉన్న ఆకతాయిలు షాక్కు గురై పారిపోయేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో పట్టుబడిన వారిలో కాలేజ్ స్టూడెంట్లు, ఉద్యోగస్తులు, గంజాయి మత్తులో ఉన్న యువకులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసులు నమోదు చేయకుండా 40 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీపీ సుమతి మహిళల భద్రతపై కీలక సూచనలు చేశారు. నగరంలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే ప్రాంతాల్లో నిరంతర గస్తీ ఉండాలని స్పష్టం చేశారు.
సీపీ సుమతి చేసిన ఈ అండర్కవర్ ఆపరేషన్పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో మాత్రమే చూసే “సింగం” తరహా ఆపరేషన్ను నిజ జీవితంలో చేసి చూపించారని సోషల్ మీడియాలో ఆమెను “లేడీ సింగం”గా అభివర్ణిస్తున్నారు.
మహిళల భద్రతపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ఆపరేషన్లు తరచుగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

