బీజేపీ జెండాతోనే చావాలి”.. కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్‌తో బీజేపీ నాయకుడు బండి సంజయ్ వార్తల్లో నిలిచారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఆయన, అలాంటి “ఫాల్తూ ఆలోచనలు” తనకు రావని స్పష్టం చేశారు.

భారతీయ జనతా పార్టీపై తనకున్న కమిట్మెంట్‌ను వివరిస్తూ బండి సంజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చచ్చిపోయిన తర్వాత నా మీద బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న కార్యకర్తల్లో జోష్ నింపాయి.

తాను ఎన్నో శిక్షణా శిబిరాల్లో బీజేపీ కార్యకర్తలను తయారు చేసిన నాయకుడినని, పార్టీ కోసం కష్టపడే కమిటెడ్ కార్యకర్తనని చెప్పారు. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తనపై వస్తున్న కొత్త పార్టీ ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది మేమే. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టింది బీజేపీయే” అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో నడుస్తోందన్న ప్రచారాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. “17 మంది ఎంపీలు ఉన్న కేసీఆర్ మమ్మల్ని బర్తరఫ్ చేస్తాడంటారా? ఆయన ఫార్మ్ హౌస్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నాడు” అంటూ మండిపడ్డారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక కేసు నేపథ్యంలో కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “తన కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన తండ్రి ఎవరైనా ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని సమాచారం అందిన వెంటనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని చెప్పారు.

ఇక ఫేక్ మీడియా, తప్పుడు ప్రచారాలపై కూడా బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. “ఫేక్ మీడియా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఎవరు ఏం ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు” అని అన్నారు.

ప్రస్తుతం బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కొత్త పార్టీ ప్రచారం, కేసీఆర్‌పై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *