దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరగడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరో పెద్ద భారంగా మారింది. గత రెండు వారాల్లోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపు 7 నుంచి 8 రూపాయల వరకు పెరగడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య భారీ తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తేడా కూడా క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య కేవలం 10 నుంచి 15 రూపాయల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. మరోవైపు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతుండటంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ క్రమంగా భారంగా మారుతున్నాయి.
ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. చివరికి ఆ భారం మొత్తం సామాన్య ప్రజల భుజాలపైనే పడుతుంది. “మా మీద భారం పెరిగింది కాబట్టి ధరలు పెంచాల్సి వచ్చింది” అని వ్యాపారులు చెబుతారు. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవనం మరింత కష్టమవుతోంది.
ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించాలని సూచిస్తున్నప్పటికీ అది ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి సరైన బస్సు సౌకర్యం ఉండకపోవచ్చు. చాలామందికి ఇంటి నుంచి బస్ స్టాప్ దూరంగా ఉండొచ్చు. ఉద్యోగాలకు వెళ్లే వారు, షిఫ్ట్ డ్యూటీలు చేసే వారు, చిన్న పట్టణాలు లేదా గ్రామాల నుంచి ప్రయాణించే వారికి సొంత వాహనం తప్పనిసరి పరిస్థితి.
ఇక కొత్త వాహనాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక సాధారణ బైక్ కొనాలన్నా ఇప్పుడు లక్ష రూపాయలకు పైగానే ఖర్చు అవుతోంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద భారంగా మారింది. EMIలు, ఇంధన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు అన్నీ కలిపి ఒక సాధారణ ఉద్యోగి పరిస్థితి క్లిష్టంగా మారుతోంది.
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉంది. నెలకు 40 వేల రూపాయల జీతం వచ్చే వ్యక్తి కూడా ఇంటి అద్దె, పిల్లల చదువు, కరెంట్ బిల్లు, పెట్రోల్ ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం ఒక సాధారణ ఇంటి అద్దె కూడా 15 వేల నుంచి 20 వేల వరకు ఉండటం గమనార్హం.
ఇంధన ధరల పెరుగుదలపై రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు అదే ప్రజలపై మరింత భారం మోపుతున్నాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వాహనాలు, కాన్వాయ్లు, అధికారుల ఖర్చులు అన్నీ ప్రజల పన్నుల ద్వారానే నడుస్తున్నాయని, కానీ సామాన్యుడి కష్టాలపై మాత్రం ఎవరూ మాట్లాడడం లేదని ప్రజలు అంటున్నారు.
ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్ బంక్ వద్ద అదనంగా డబ్బులు చెల్లించడం మాత్రమే కాదు. అది ప్రతి కుటుంబ బడ్జెట్ను ప్రభావితం చేసే అంశం. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆహారం నుంచి విద్య వరకు ప్రతి రంగంపై ప్రభావం పడుతుంది. అందుకే ఇంధన ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

