మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలా?.. లీటర్‌కు మరో రూ.10 పెంపు సూచనలు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా ఇంధన ధరలను పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఆర్థిక సేవల సంస్థ MK Global విడుదల చేసిన నివేదికలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు మరో రూ.10 వరకు పెంచాల్సి రావచ్చని పేర్కొంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. దేశీయంగా ధరలు పెంచకపోతే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మరింత నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను సగటున రూ.3 మేర పెంచింది. అంతకుముందు ఇంధనాలపై లీటర్‌కు సుమారు రూ.10 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంకే గ్లోబల్ అంచనా ప్రకారం వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో దశలవారీగా లేదా ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం సుమారు 0.3 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశ జీడీపీ వృద్ధి అంచనాలపై కూడా పడుతున్నట్లు ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా ఇంధన ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.15 నుంచి 0.25 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలపై మరోసారి ఆర్థిక భారం పడే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *