సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర?
సింగరేణి ఓబి టెండర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు**
సింగరేణి ఓబి (ఓవర్బర్డన్) కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టెండర్లు ప్లస్ 5 నుంచి ప్లస్ 10 శాతం వరకు వెళ్తుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, అలాగే గతంలో సింగరేణిలో జరిగిన ఓబి టెండర్లలో సాధారణంగా –10 నుంచి –22 శాతం వరకు తగ్గింపుతో టెండర్లు ఫైనల్ అయ్యేవని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా –7 నుంచి –20 శాతం వరకు టెండర్లు జరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ విధానం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆరోపణ. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని ఓబి టెండర్లు ప్లస్లోనే ఫైనల్ అవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఒక టెండర్ను రద్దు చేస్తూ, “కేవలం ఒక బ్లాక్కు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది” అని ప్రభుత్వం చెప్పడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని విమర్శకులు అంటున్నారు. మరి మిగతా బ్లాక్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్ వల్ల ఏమవుతోంది?
సాధారణంగా ఆన్లైన్ టెండర్ విధానం ఉంటే దేశంలో ఎక్కడి నుంచి అయినా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు నేరుగా టెండర్ వేయగలుగుతారు. కానీ సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడంతో, కాంట్రాక్టర్ ముందుగా సైట్కు వెళ్లి, సింగరేణి నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి వస్తోంది.
దీని వల్ల ఎవరు టెండర్ వేస్తున్నారో ముందుగానే తెలుసుకునే అవకాశం అధికార వర్గాలకు లభిస్తోందని ఆరోపణ. ఆ సమాచారం ఆధారంగా కాంట్రాక్టర్లపై నయాన్నో, భయాన్నో, బెదిరింపులనో ప్రయోగించి టెండర్ వేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఏజెంట్, గ్యాంగ్ వ్యవస్థ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను నియమించి, టెండర్లు ఎవరు వేస్తున్నారో ముందే తెలుసుకుని, అనుకూల కాంట్రాక్టర్లతో ప్లస్ 10 శాతం రేట్లకు టెండర్లు వేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా టెండర్లను తమ అనుయాయులకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేని సమయంలో దేశవ్యాప్తంగా ఎవరైనా స్వేచ్ఛగా టెండర్ వేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా తొలగించి అవకతవకలకు తలుపులు తెరిచారని ఆరోపిస్తున్నారు

