తెలంగాణలో రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మహిళా రైతు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“వేల రూపాయలు ఖర్చు చేసి పంట పండించాం. కానీ వర్షాలతో వడ్లు మురిగిపోతున్నాయి. రాత్రంతా తల పట్టుకుని కూర్చుంటున్నాం” అంటూ ఆమె బాధను వ్యక్తం చేసింది. పండించిన ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది.
ప్రభుత్వం ప్రకటించిన మహిళా పథకాలపై కూడా ఆమె విమర్శలు గుప్పించింది. “మహిళలను కోటీశ్వరాలు చేస్తామని చెప్పారు. ₹2500 ఇస్తామని చెప్పారు. కానీ ఎవరికీ ఏమీ రాలేదు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఉచిత బస్సు పథకంపై మాట్లాడుతూ, “ఫ్రీ బస్సు పెట్టినా రైతుకు ఉపయోగం ఏముంది? మాకు గిట్టుబాటు ధర కావాలి, పంటకు భరోసా కావాలి” అని ప్రశ్నించింది. రైతుల సమస్యలు పరిష్కరించకుండా పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
మాజీ సీఎం K. Chandrashekar Rao అమలు చేసిన రైతు బంధు పథకాన్ని ప్రస్తావిస్తూ, “అప్పుడు ప్రతి ఎకరానికి రైతు బంధు వచ్చేది. రైతులకు అండగా ఉండేవారు” అని పేర్కొంది.
రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆమె ఆరోపించింది. “కొంతమందికే రుణమాఫీ అయింది. చాలా మంది రైతులకు ఉపయోగం కాలేదు” అని పేర్కొంది.
ప్రస్తుతం రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పంట నష్టాలు, ఎరువుల కొరత, మార్కెట్ సమస్యలతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

