మేడిపల్లిలో ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి – బీసీ సంఘాల ఆందోళన తీవ్రం

మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్, బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

సాయి ఈశ్వర్ మృతి వార్త తెలిసిన వెంటనే బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కుల సంఘాల జేఎస్సీ చైర్మన్ కుందారం గణేశాచారి మరియు వందలాది బీసీ నేతలు గాంధీ హాస్పిటల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు.

ఆందోళనకారులు “సాయి మృతికి కాంగ్రెస్ – బీజేపీ ప్రభుత్వాలే కారణం” అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లనే సాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వాలే చేసిన హత్య అని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మృతికి బాధ్యత వహించాలంటూ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కనీసం కోటీ రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలని నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *