హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రగతి, నగర సంస్కృతి గురించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఒక్క వ్యక్తి లేదా ఒక్క నాయకుడు నిర్మించలేదని, ఈ నగరం శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన శైలితో ప్రత్యేకత సాధించిందని పేర్కొన్నారు.
“హైదరాబాద్కు ఘనతను ఒక వ్యక్తికి ఇవ్వలేం. ఈ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ ఒక్క రోజులో నిర్మించబడనట్టే హైదరాబాద్ కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది” అని కేటీఆర్ అన్నారు.
నగర ఆత్మ భవనాల్లో లేదని, ప్రజల సంస్కృతి, భాష, ఆహారం, సంప్రదాయాల్లో ఉందని ఆయన చెప్పారు. “కొన్ని భవనాలు, బ్లాకులు నిర్మించవచ్చు. కానీ నగరానికి ప్రత్యేకత తీసుకువచ్చేది దాని సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన విధానం” అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ ఈరోజు ఎన్నో అంశాల కలయికగా ఎదిగిందని, అది ఒక్క రాజకీయ నాయకుడి వల్ల సాధ్యమైనది కాదని స్పష్టం చేశారు. “మేము కూడా పరిమిత స్థాయిలో కొంత సహకారం అందించి ఉండవచ్చు. కానీ నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది” అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రజల సామర్థ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని కేటీఆర్ గుర్తు చేశారు. “తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఉందా అని ప్రశ్నించేవారు. ఆ మాట మాకు ఒక సవాల్గా మారింది. అదే మాకు ప్రేరణ ఇచ్చింది” అని పేర్కొన్నారు.
కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ దేశంలో జీఎస్డీపీ పరంగా అగ్రస్థానానికి చేరిందని, తలసరి ఆదాయంలో కూడా నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. “ఇవి సాధారణ విజయాలు కావు. ఇవన్నీ కేసీఆర్ దార్శనికత, తెలంగాణ ప్రజల కృషి వల్ల సాధ్యమయ్యాయి” అని ఆయన తెలిపారు.
తెలంగాణ గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఆ అభివృద్ధి మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

