కే చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్లో నిర్వహించిన కీలక సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటంటే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు, పరిపాలనా విధానాలు, సర్వేలు అన్నీ డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వాలను కూడా అదే విధంగా నమోదు చేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో దాదాపు 32 వేల పోలింగ్ బూత్లు ఉన్నాయని, ప్రతి బూత్కు ఇద్దరు చొప్పున కమిటీ సభ్యులను నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ ప్రకారం సుమారు 70 వేల మందికి పైగా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వీరి ప్రధాన పని సభ్యత్వ నమోదు, కార్యకర్తల సమన్వయం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఉండనుంది.
అయితే కేసీఆర్ ఈ సమావేశంలో ఒక కీలక సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. “నెంబర్ కాదు.. కమిట్మెంట్ ముఖ్యం” అని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా సమాచారం. లక్షల్లో సభ్యత్వాలు రావడం కంటే పార్టీ కోసం కష్టపడే, క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు ఉండటం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారట. కేవలం పేరు కోసం సభ్యత్వం తీసుకుని సైలెంట్గా ఉండేవారికంటే, గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పనిచేసే వారినే ఎంపిక చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
ఈ ఫిల్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకర్షించడం, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడం, పాత కార్యకర్తలను కూడా కొనసాగించడం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని మళ్లీ యాక్టివ్ చేయడం ద్వారా రాబోయే ఎన్నికల పరిస్థితిని ముందుగానే అంచనా వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక కమిటీల విషయంలో కూడా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ సూచించారట. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు పనిచేసిన వారికి అన్యాయం జరగకూడదని, అటువంటి వారిని గౌరవించాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. సభ్యత్వ నమోదు సమయంలో ఎవరిని పడితే వారిని చేర్చకుండా, భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే కార్యకర్తలను ఎంపిక చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్లో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం, సభ్యత్వ నమోదు కమిటీల నిర్మాణం, డిజిటల్ డేటా మేనేజ్మెంట్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే.. ఈ డిజిటల్ ఫిల్ట్రేషన్ వ్యూహం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ గ్రౌండ్ లెవెల్లో బలపడుతుందా? లేక సభ్యత్వాల పరిమితీకరణ వల్ల పార్టీ బలం తగ్గుతుందా? అన్నది. అయితే కేసీఆర్ మాత్రం సంఖ్య కంటే నిబద్ధతతో పనిచేసే క్యాడర్పైనే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.

