ఆర్టీఓ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఆర్టీఓ చలాన్ APK” పేరుతో జరుగుతున్న ఈ మోసంలో వాహనదారులకు WhatsApp, SMS, MMS ద్వారా సందేశాలు పంపుతూ “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే జరిమానా చెల్లించండి” అంటూ భయపెడుతున్నారు.

ఈ మెసేజ్‌లలో ఒక లింక్ ఇచ్చి, దాని ద్వారా APK ఫైల్ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఆ ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం మొత్తం వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ WhatsApp లేదా సాధారణ మొబైల్ నంబర్ల ద్వారా APK ఫైళ్లను పంపవని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే చెక్ చేసి, అక్కడే చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు.

మేడ్చల్‌లో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీ

ఇక నగరంలో మరోసారి నేపాల్ గ్యాంగ్ అరాచకం కలకలం రేపింది. మేడ్చల్ సమీపంలోని జవహర్‌నగర్ కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో పని మనుషుల్లా చేరిన వ్యక్తులు భారీ దోపిడీకి పాల్పడ్డారు.

ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి, 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30 వేల నగదు దోచుకుపోయినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం మత్తు నుంచి కోలుకున్న దంపతులు కిటికీ నుంచి అరవడంతో పొరుగువారు వచ్చి వారిని రక్షించారు.

ఇటీవల మాజీ IPS అధికారి వినయ్ రంజన్ భార్య హత్య కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే ఇదే తరహా ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. పని మనుషులుగా ఇళ్లలో చేరి, ఇంటి పరిస్థితులను గమనించి దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ప్రజలకు పోలీసుల సూచనలు

  • ఇంట్లో పని చేసే వారి పూర్తి వివరాలు తీసుకోవాలి
  • ఆధార్, ఫోన్ నంబర్, స్వగ్రామ సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
  • సమీప పోలీస్ స్టేషన్‌లో వారి వివరాలు వెరిఫై చేయించుకోవాలి
  • అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లు డౌన్లోడ్ చేయకూడదు
  • బ్యాంక్ OTPలు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు

ప్రస్తుతం నగరంలో సైబర్ మోసాలు, పని మనుషుల రూపంలో దోపిడీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *