హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునే ఓకే టీవీ ప్రత్యేక కార్యక్రమం “బస్తీలో కుస్తీలు” ఈసారి రహమత్ నగర్ డివిజన్కు చేరుకుంది. ఇప్పటికే యూసుఫ్గూడ, బోరబండ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమం తర్వాత రహమత్ నగర్లో స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ప్రధానంగా రహమత్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, మురుగు నీటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు తెలిపారు. మరోవైపు, మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పనితీరుపై మాత్రం ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
రోడ్లు మెరుగయ్యాయి.. కానీ డ్రైనేజీ సమస్య అలాగే
13 ఏళ్లుగా రహమత్ నగర్లో నివసిస్తున్న ఓ స్థానికుడు మాట్లాడుతూ, గతంలో రహదారులు చాలా దారుణంగా ఉండేవని, ఇటీవల రోడ్లు వేయడం వల్ల కొంత ఉపశమనం లభించిందన్నారు. అయితే డ్రైనేజీ మాత్రం మూడు రోజులకు ఒకసారి పొంగిపొర్లుతుందని, ఫిర్యాదు చేసినా అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారని చెప్పారు.
50 ఏళ్లలో ఎన్నో మార్పులు.. ఇప్పుడు కొత్త సమస్యలు
సుమారు 45–50 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ, ఒకప్పుడు కరెంట్, మంచినీరు, డ్రైనేజీ ఏవీ లేకపోయినా ఇప్పుడు అపార్ట్మెంట్లు పెరగడంతో కొత్త సమస్యలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, స్కూల్ పిల్లలు, వృద్ధులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచినీటి కోసం గంటల తరబడి ఎదురుచూపులు
ప్రజలు ప్రధానంగా తాగునీటి సరఫరాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్లు ఎప్పుడు వస్తాయో సమయం ఉండడం లేదని, ఒక రోజు రాత్రి, మరో రోజు ఉదయం, ఇంకో రోజు వేరే సమయంలో వస్తుండటంతో ప్రజలు నిద్ర మానుకుని నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కొంతమంది మహిళలు అరగంట మాత్రమే నీళ్లు వదులుతున్నారని, పెద్ద కుటుంబాలకు అది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. తాగడానికి, స్నానాలకు, ఇంటి అవసరాలకు నీళ్లు చాలడం లేదని వాపోయారు.
రోడ్లు వేసిన తర్వాతే డ్రైనేజీ సమస్య పెరిగిందా?
స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఇటీవల రోడ్లు నిర్మించిన తర్వాత డ్రైనేజీ లైన్లు తరచూ మూసుకుపోతున్నాయని తెలిపారు. వారం రోజుల క్రితమే శుభ్రం చేసినా మళ్లీ మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని చెప్పారు. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అధికారులు రావడానికి 10 నుంచి 15 రోజులు పడుతోందని ఆరోపించారు.
మెయిన్ రోడ్ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి
రహమత్ నగర్ ప్రధాన రహదారి దుస్థితిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షం పడితే మొత్తం రోడ్డు జలమయమవుతోందని, గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని పలువురు వ్యాఖ్యానించారు.
చెత్త సేకరణ మాత్రం సక్రమమే
చెత్త సేకరణ విషయంలో మాత్రం ప్రజలు సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు.
సీఎన్ రెడ్డి పనితీరుపై మిశ్రమ అభిప్రాయం
మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి గురించి అడగగా కొందరు ప్రజలు ఆయన తమ సమస్యలకు వెంటనే స్పందించేవారని, ఫోన్ చేస్తే అధికారులు పంపించి పనులు చేయించేవారని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే మరికొందరు ప్రజలు ఇంకా తాగునీరు, డ్రైనేజీ, మెయిన్ రోడ్డు సమస్యలు అలాగే ఉన్నాయని, ప్రజలకు అత్యవసరమైన అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రజల అభిప్రాయం
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల పనితీరునే ప్రజలు పరిశీలిస్తామని, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారో వారికే మద్దతు ఇస్తామని పలువురు పేర్కొన్నారు. సీఎన్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే గతంలో చేసిన పనుల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని కొందరు అభిప్రాయపడ్డారు.
రహమత్ నగర్ ప్రజల మాటల్లో స్పష్టంగా వినిపించిన విషయం ఏమిటంటే… రోడ్లలో కొంత అభివృద్ధి కనిపించినప్పటికీ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ప్రధాన రహదారి పరిస్థితి వంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయన్నది.

