జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన గానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు విషప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై ప్రజలకు బహిరంగంగా చెప్పి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రజలతో చర్చించకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదని, యథాతథంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా నిజాన్ని గుర్తించే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉందన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అంటేనే బ్లాక్మేయిల్ రాజకీయ సమితిగా మారిందని, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అబద్ధపు ప్రచారాలతో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. జిల్లాల రద్దు అంటూ లేనిపోని భయాలు సృష్టించడం దానికి నిదర్శనమన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల అభిప్రాయాలతోనే ఉంటాయని, ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని సీఎం పునరుద్ఘాటించారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఏ అంశంపై ప్రజలతో చర్చించిందన్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయని, వాటికీ సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక పథకాలు, హామీల అమలుపై కూడా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా లెక్కలు చెప్పి ప్రజలను గందరగోళంలోకి నెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. మహిళలకు ఇచ్చే హామీలు, సంక్షేమ పథకాల అమలు విషయంలో స్పష్టతతో ముందుకు వెళ్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సోమవారం నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభం కానుండటంతో, కలెక్టర్తో పాటు ఎన్నికల కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

