దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్న వేళ సామాన్య ప్రజల జీవనం మరింత కష్టసాధ్యంగా మారుతోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదల ఇప్పుడు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్ ₹600–₹700 మధ్య లభించగా ప్రస్తుతం దాదాపు ₹993 వరకు చేరిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరలకు సమానంగా చిన్న సిలిండర్ల ధరలు పెరగడంతో చిన్నచిన్న వ్యాపారాలు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుతం హోటళ్లలో ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ₹3000 దాటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో టీ, టిఫిన్లు, హోటల్ భోజనాల ధరలు కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రస్తుతం ₹10కి దొరికే టీ త్వరలో ₹15కి చేరొచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఇడ్లీ, దోసె వంటి సాధారణ టిఫిన్లకూ వర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు.
చిన్న ఉద్యోగాలు చేసే వారు, వాచ్మన్ డ్యూటీలు చేసే వారు, గుడిసెల్లో జీవించే పేద కుటుంబాలు కూడా ఇప్పుడు గ్యాస్పై ఆధారపడుతున్నాయి. అయితే తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో గ్యాస్ ధరల పెరుగుదల వారి బతుకును మరింత భారంగా మారుస్తోందని ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ మాత్రమే కాదు.. కూరగాయలు, ఉల్లిపాయలు, టమాటా వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయనే భయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, గ్యాస్ ధరల పెంపుపై రాజకీయ విమర్శలు కూడా తీవ్రమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజల కోసం పెద్ద పెద్ద హామీలు ఇచ్చే నాయకులు, ఎన్నికలు ముగిసిన తర్వాత ధరల పెంపుపై మౌనం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

