తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫండమెంటల్ రైట్స్ తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన సందర్భాల్లో రాజ్యాంగాధికారిగా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉండగా ఆయన కూడా బాధ్యతను విస్మరిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేత తీవ్ర విమర్శలు చేశారు.
సుమారు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పెన్షన్, డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ నిధులను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
తమ హక్కుల కోసం గవర్నర్ను కలవడానికి వెళ్లిన వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను రోడ్లపై ఆపి పోలీస్ వ్యాన్లలో అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ఫండమెంటల్ రైట్స్ను కాపాడాల్సిన గవర్నర్ కార్యాలయం గేట్లు మూసుకొని నిరసన స్వరాలను అణిచివేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం పథకాలు, ఉచితాల పేరుతో ఖర్చులు చేస్తూ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బకాయిలను ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి, ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండ్ చేశారు.

